
జగన్ విషయంలో అధిష్టానం వైఖరి శ్రుతి మించితే అది రాష్ట్రంలో రోశయ్య ప్రభుత్వానికి ముప్పుగా పరిణమిస్తుందని రాజకీయ పరిశీలకులు, నిఘావర్గాలు కూడా భావిస్తున్నాయి. సెప్టెంబరు 3వ తేదీన వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర ప్రారంభించదలిచారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఈ అంశం ఇప్పటికే ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో అధిష్టానం పెద్దమనిషిలా కాకుండా దుందుడుకుగా వ్యవహరిస్తున్న తీరుతో కాంగ్రెస్ పార్టీలో చీలిక అనివార్యం కావచ్చని భయపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం జగన్ ఓదార్పు యాత్రను దెబ్బకొట్టేందుకు ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవడం ఈసారి విశేషం. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ప్రత్యక్షంగా అధిష్టానం దూతలు నేరుగా సంభాషిస్తూ వారిని జగన్ కు దూరం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నటు భోగట్టా. ఓదార్పు యాత్ర విషయంలో మినహా మిగిలిన అన్ని విషయాల్లోనూ జగన్ అధిష్టానానికి విధేయుడే. అయినా సరే పరిగణనలోకి తీసుకోకుండా ఇలా వ్యతిరేక ధోరణితో పార్టీ పెద్దలు వ్యవహరించడాన్ని జగన్ వర్గం స్వతహాగానే జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపధ్యంలో వైఎస్.జగన్మోహన్ రెడ్డి కూడా అమీతుమీకే సిద్ధమయ్యారు. ఎవరెన్ని చెప్పినా ఓదార్పు యాత్ర ఆగదని ఆయన ఈసరికే తేల్చి చెప్పారు. అధిష్టానం రెచగొడుతున్నట్టే ఆయన తన భవిష్యత్ కార్యచరణపై అనుకూల వర్గంతో, అభిమానులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఓదార్పు యాత్రను మాత్రం యధావిధిగా కొనసాగించాలనే కృతనిశ్చయంతో జగన్ ఉన్నారు. అయితే పార్టీ జగన్ పై క్రమశిక్షణ చర్య వంటి దుస్సాహసానికి పాల్పడితే మాత్రం జగన్ సొంతపార్టీ పెట్టడం లేదా రాష్ట్ర కాంగ్రెస్ ను చీల్చడం అనివార్యం అవుతాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను ఓదార్పులో పాల్గొనాల్సిందిగా జగన్ కోరినప్పుడు అధిష్టానం తమను దూరంగా ఉండాలని ఆదేశించిన విషయాన్ని వారు చెప్పినట్టు సమాచారం. జగన్ ఈ యాత్రను తన వ్యక్తిగత యాత్ర అని ప్రకటించిన నేపథ్యంలోనే సోనియా గాంధీ ఓదార్పులో పార్టీ ప్రతినిధులను పాల్గొనవద్దని ఆదేశించారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే అధిష్టానం మాటను కూడా కాదని ప్రకాశం, నెల్లూరు జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు జగన్ యాత్రకు మద్దతు పలుకుతామని బహిరంగంగా ముందుకు రావడం రాష్ట్ర సర్కారుకు ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. సెప్టెంబరు 2వ తేదీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రథమ వర్థంతి రోజున జగన్ కచ్చితంగా ఏదో చేయబోతున్నారని కాంగ్రెస్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారంలో ఉంది.

No comments:
Post a Comment