తూర్పు ఓదార్పు యాత్రకు భారీ బల ప్రదర్శనతో స్వస్తి
మొత్తమ్మీద తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు యాత్ర ముగిసింది. అనుకున్న దానికంటే పది పన్నెండు రోజులు షెడ్యూల్ పెరగ్గా ఏకంగా 19 రోజులపాటు సాగిన జగన్ ఓదార్పు యాత్ర కాకినాడ నేతాజీ పార్క్ వద్ద భారీ జనసంద్రం మధ్య జరిగిన బహిరంగ సభతో ముగిసింది. ఈ సభలో సభికుల జయజయధ్వానాల మధ్య వైఎస్ జగన్ ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. ఆయన ప్రసంగంలో తనను అభిమానించే జనంపై అవ్యాజమైన అభిమానం తొణికిసలాడింది. చాలా సరళమైన పదాలే అయినా... పేలోడ్ మోసుకెళ్ళే క్షిపణుల్లా ఆయన హెచరికలు పేలాయి. ఆచితూచి చేసిన ఆయన ప్రసంగం సింపుల్ అయినా సుపర్బ్ గా నిల్చింది. తన పట్ల ఎంతో ప్రేమను చూపిన అంబటి రాంబాబు, కొండా సురేఖలకు అన్యాయం జరిగిందని జగన్ అన్నారు. ఇది చూసి తన గుండె బరువెక్కి పోయిందన్నారు. తనకు ఎంత కాలం ఈ సహనం ఉంటుందో, ఎన్ని రోజులు ఇలా ఉండగలనో తెలియదని వ్యాఖ్యానించడం ద్వారా తన మదిలో భావాన్ని చాలా స్పష్టంగా ఆయన చెప్పేశారు. తద్వారా కాంగ్రెస్ అధిష్ఠానం ధోరణిపై సవాల్ విసిరారు.
2004 వరకూ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించి అధికారంలో నిలబెట్టడమే కాక ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నింపాలని తన తండ్రి వైఎస్సార్ అహరహం తపించారని ఆయన స్మరించుకున్నారు. రాష్ట్రంలో 26 లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను చదువుతున్నారంటే దానికి కారణమెవరని ఆయన ప్రశ్నించారు. అందరూ బదులుగ వైఎస్ ఆర్ అని అరిచారు. సంక్షేమ పథకాలు పేదవాడికి అందుతున్నాయంటే దానికి కారణమెవరు..? ప్రాజెక్టులు కట్టించి... జలయజ్ఞం చేసి కోటి ఎకరాలు సాగు చేసిన ఘనత ఎవరిదని ఆయన అడిగారు. ఇంత సేవ చేసిన మహానేత కన్నుమూస్తే, ఆయన చనిపోయినందుకు కొన్ని గుండెలు ఆగిపోతే.. వారిని పరామర్శించడం తప్పా...? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. దీనిలో రాజకీయ కుట్ర దాగి ఉందా...?" అంటూ ఆవేదన చెందారు.
తన ఓదార్పు యాత్ర వెనుక తనలో ఎటువంటి కుళ్లూ కుతంత్రం లేదనీ, కానీ కొంతమంది తను చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు యత్నించారన్నారు. ఈ పరిస్థితిల్లో ఒకటే అనుకున్నాను. ఎంతకాలం బతికాం అన్నది కాదు.. ఎలా బతికాం, ఎవరికోసం బతికాం అన్నది ముఖ్యం... అందుకే అన్నీ వదులుకుని నాన్నకు ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం మీకోసం కదిలి వచ్చానని జగన్ అన్నారు. జగన్ యాత్ర తూర్పున ముగిసిన సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి మొత్తం సుమారు 30మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు హాజరైనట్లు చెబుతున్నారు. జగన్ కు అంత సీన్ లేదని గత కొన్నిరోజులుగా విపరీత వ్యాఖ్యలు చేసిన పలువురు కాంగ్రెస్ పెద్దలకు ఈ సభతో కళ్ళు చెదిరి ఉంటాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
