Wednesday, April 27, 2011

సాక్షి లో పెయిడ్ ఆర్టికిల్స్ ట !

ఎన్నికల సంఘం సాక్షి టివీఛానల్ లో ప్రసారమైన, పత్రికలో ప్రచురితమైన తొమ్మిది ఆర్టికిల్స్ ను పెయిడ్ ఆర్టికిల్స్ గా పరిగణించామని ఎన్నికల ముఖ్య అధికారి బన్వర్ లాల్ చెప్పడం విశేషంగా ఉంది. వీటిలో పెయిడ్ ఆర్టికిల్ అంటే నిర్వచనమేమిటో తెలియదుకాని ఇది కొంత ఆసక్తిగానే ఉంది. జిల్లా స్థాయిలో ఉండే ఒక సమన్వయ కమిటీ వీటిని గుర్తించి సిఇఓకి తెలియచేసింది. ఇవి కనుక పెయిడ్ ఆర్టికిల్ప్ అని తేలితే ఆ ఖర్చును అభ్యర్ధి ఖాతాలో జమ చేస్తారు.ఇక్కడ విషయం ఏమిటంటే సాక్షి ఛానల్ కాని, పత్రిక కాని రెండూ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డివే.అలాంటప్పుడు ఆయనకు అనుకూలంగా వేసే వార్తలే అనండి, ఆర్టికిల్సే అనండి వాటికి డబ్బు ఎవరిచ్చారని చెబుతారు. జగన్ తన పత్రికలో తానే
డబ్బిచ్చి అది కూడా అనధికారికంగా వేసుకుంటారా.? ఇందులో లాజిక్ అర్ధం కావడం లేదు. మరి ఇతర ఛానళ్లలో ఆయా పార్టీలకు అనుకూలంగా అనేక వార్తలు వస్తున్నాయి. అవన్ని పెయిడ్ న్యూస్ కిందకు రావా? దానిని ఎవరూ గుర్తించలేదా? అలాగే ఇంకో విషయం జగన్ మీడియాలో కాంగ్రెస్,తెలుగుదేశం వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతుంటే, జగన్ ప్రత్యర్ధి మీడియాలో జగన్ కు వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం జరుగుతోది. కేవలం పాజిటివ్ వార్తలనే పెయిడ్ న్యూస్ గా పరిగణిస్తారా? లేక నెగిటివ్ వార్తలను కూడా తీసుకుంటారా అన్నది తేలాలి. కాగా టిడిపి బృందం ఇప్పటికే సాక్షిపై ఎన్నికల సంఘం వరకు వెళ్లి ఫిర్యాదు చేసి వచ్చింది. అందులో జరిగే జగన్ ప్రచారం అంతటిని జగన్ ఖాతాలో వేయాలని కోరింది. అదే ప్రకారం మిగిలినవాటిలో జరిగే ప్రచారాన్ని కూడా తీసుకోవాలి కదా.నిజానికి జగన్ కు సాక్షి లో ప్రచారం జరగడం లేదని ఎవరూ అనరు.కాని పెయిడ్ న్యూస్ గా ఎలా నిర్ధారించారన్నదే అర్దం కాకుండా ఉంది. లేదా ఫలానా వార్తలను ప్రసారం చేస్తే పెయిడ్ న్యూస్ అవుతాయని ఎన్నికల సంఘం ఎక్కడైనా చెప్పిందా? ఇందులో కాస్త స్పష్టత కొరవడినట్లుగా ఉంది.

కర్టెసీ : కొమ్మినేని శ్రీనివాసరావు

Monday, February 7, 2011

జగన్ హరితయాత్రకు వెల్లువెత్తిన రైతన్నలు


రాష్ట్రంలోని దాదాపు సగం జిల్లాలకూ మేలు చేకూర్చే వరం పోలవరం. దశాబ్దాలుగా ఇది కలగానే మిగిలింది. కానీ  వైఎస్ రాజశేఖరరెడ్డి అపరభగీరధుడై ఈ కలకు ప్రాణప్రతిష్ట చేశారు. పనులు పరుగులు తీశాయి. కానీ ఆయన మరణంతో ఈ ప్రాజిక్ట్ పనులు మళ్ళీ పడకేశాయి.  తర్వాత రాజకీయం పడగనీడన రైతు సంక్షేమం బలైంది. అయితే మహానేత ఆశయం అనాధ కాలేదు. జననేతగా రూపాంతరం చెందిన యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు, పోలవరం నిర్మాణానికి  యంత్రాంగాల్ని కదిల్చేందుకు, రాజన్న కలల్ని సాకారం చేసేందుకు నడుం బిగించారు. పోలవరం సాధన కోసం హరిత యాత్ర సుమారు పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ప్రారంభమయ్యే ఈ యాత్ర నాలుగు రోజులపాటు సుమారు 70 కిలోమీటర్ల మేర సాగనుంది. 10న పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణ ప్రాంతం వద్ద బహిరంగ సభతో ముగిసే ఈ యాత్రకు లక్షలాదిగా రైతులు సిద్ధమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక రాత్రి, పశ్చిమగోదావరిలో రెండు రాత్రులు ఆరుబయటే షామియానాలలో యువనేత బస చేయనున్నారు.
సోమవారం ఉదయం యువనేత రాజ మండ్రి రివర్‌బే హోటల్ నుంచి బయల్దేరి ధవళేశ్వరం మీదుగా రావులపాలెం వెళ్ళారు. కళా వెంకట్రావు సెంటర్‌లో వైఎస్ విగ్రహం ఆవిష్కరించారు. వైఎస్, కళా వెంకట్రావు విగ్రహాలకు పూల మాలలు వేసి ప్రజలనుద్దేశించి ప్రాధాన్యాన్ని వివరించారు. భక్తాంజనేయ ఆలయంలో పూజలుచేసి అద్వితీయ రీతిలోపాదయాత్ర ప్రారంభించారు.
రైతు సమస్యలపై పోరుకు యువనేత భారీ, వినూత్న పోరాటాలకు తెరతీశారు. కృష్ణాతీరంలో లక్ష్య దీక్ష,  ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై జల దీక్ష, నిత్యావసర ధరలపై విశాఖ తీరంలోజన దీక్ష చేసి పాలకుల్ని గడగడలాడించిన జగన్ ఇప్పుడు హరిత యాత్ర పేరుతో పోలవరం సాధనకు అడుగులేస్తున్నారు. దీంతో మరో ప్రజా పోరాటానికి తెరతీశారు. గత మూడు దీక్షలకూ అశేషంగా హాజరైన రైతులు, ప్రజలు, అభిమానులూ ఈ యాత్రకు కూడా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి ముందుకు వస్తున్నారు. యాత్ర సాగే ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీలతో నిమిత్తం లేకుండా రైతాంగం యావత్తూ పదం కలుపుతోంది. యువనేతతోకలిసి కదం తొక్కనుంది.
ఇప్పుడు రాష్ట్రమంతా ఏ నోట విన్నా యువనేత హరిత యాత్రపైనే చర్చ. రెండు జిల్లాల్లో నేతలు, రైతుసంఘాల సమన్వయంతో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి యాత్రకు సమన్వయకర్తగా ఉన్నారు. ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, ఆళ్ల నాని, టి. బాలరాజు, ప్రసాదరాజు, మాజీ మంత్రులు ఇందుకూరి రామకృష్ణంరాజు, జక్కం పూడి రామ్మోహనరావు, ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యేలు తోట గోపాలకృష్ణ, కుడుపూడి చిట్టబ్బాయి, వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, శ్రీరంగనాథరాజు, మోషేన్‌రాజు, వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, రైతు ప్రతినిధులు హరిత యాత్ర ఏర్పాట్లలో తలమునకలయ్యారు.
పాదయాత్ర ముగింపు సభ జరగనున్న పోలవరం స్పిల్‌వే ప్రాంతంలో రైతులు స్వచ్ఛందంగా సుమారు 30 ఎకరాలను సభకోసం సమకూర్చారు. ఈ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ ఎస్. రామకృష్ణారెడ్డి, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, అత్తిలి మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు సభా ప్రాంగణంలో ఏర్పాట్లపై చర్చించారు. రాష్టవ్య్రాప్తంగా తరలివచ్చే రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో బహిరంగ సభను మధ్యాహ్నం రెండు గంటలకే ప్రారంభించనున్నామని కరుణాకరరెడ్డి తెలిపారు.

యాత్ర రూట్ ఇదీ...
* ఏడో తేదీ(తొలి రోజు) యాత్ర రావులపాలెంలో ప్రారంభమవుతుంది. ఊబలంక, మెర్లపాడు, లొల్ల, ఆత్రేయపురం, ఉచ్చిలి, పులిదిండి, వొట్టిపాలెం, వెలిచేరు, రాజవరం గ్రామాల మీదుగా పేరవరం చేరుతుంది. జగన్ రాత్రి అక్కడే బస చేస్తారు.
* ఎనిమిదో తేదీ(రెండో రోజు) యాత్ర పేరవరం నుంచి బయలుదేరుతుంది. బొబ్బర్లంక, కాటన్ బ్యారేజి, ధవళేశ్వరం, రాజమండ్రి ఆల్కాట్ తోట, రైల్వే స్టేషన్, కోటిపల్లి బస్టాండ్ సెంటర్, రోడ్ కం రైలు వంతెనల మీదుగా కొవ్వూరు చేరుకుంటుంది. యువనేత రాత్రికి కొవ్వూరులో బసచేస్తారు.
* తొమ్మిదో తేదీ(మూడో రోజు) కొవ్వూరు నుంచి బయలుదేరే యాత్ర కాపవరం, ధర్మవరం, ములకపల్లి, పెద్దేవం, బల్లిపాడు, వేగేశ్వరపురం, తాళ్లపూడి, ప్రక్కిలంక, తాడిపూడి మీదుగా గూటాల చేరుకుంటుంది. జగన్ రాత్రికి గూటాలలో బస చే స్తారు.
* పదోతేదీ(చివరి రోజు) యాత్ర గూటాలలో ప్రారంభమై కొత్త పట్టిసీమ, పాత పట్టిసీమ, కన్నాపురం జంక్షన్, బంగారమ్మపేట మీదుగా పోలవరం చేరుకుంటుంది. అక్కడి ప్రాజెక్టు స్థలంలో జరిగే బహిరంగ సభలో జగన్ రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడితో యాత్ర ముగుస్తుంది.