నాడు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్ రాజశేఖరరెడ్డి అస్వస్థతకు గురైంది తూర్పుగోదావరి జిల్లాలోనే. పదిరోజులకు పైగా ఆయన రాజమండ్రిలోని ఓ తోటలో విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత యాత్ర కొనసాగించారు. ఇక అప్పటినుంచి ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా సింపతీ వెల్లువెత్తింది. ఇక ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
ఇపుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా సెంటిమెంట్ గా తూర్పులో ఓదార్పుయాత్ర కలిసొచ్చింది. ఓదార్పు యాత్ర అధిష్టానానికి వ్యతిరేకమని కొందరు, దీనిపై జగన్ కు షోకాజ్ నోటీసులిచ్చారని ఇంకొందరు ప్రచారం చేస్తూ జగన్ పార్టీని వదిలేస్తారని నానా కంగాళీ సృష్టించారు. ఈ గందరగోళం మధ్య ఆయన యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది. మొదటి అంకంలో కొందరు ఎమ్మెల్యేలు కూడా యాత్రకు మొహం చాటేశారు. యాత్రలో పాల్గొన్న ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ని అధిష్టానం చివాట్లు పెట్టిందని కూడా ప్రచారం లేవదీశారు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్ధంకాని వాతావరణాన్ని సృష్టించి పారేశారు. అయితే తూర్పున నాలుగోరోజు యాత్ర నాటికల్లా ఈ అనుమాన మేఘాలు వీడిపోయాయి. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ప్రకటనతో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గంలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. వైయస్ జగన్ పై ఏ విధమైన చర్యలుండవని మొయిలీ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. జగన్ పై పార్టీ అధిష్టానం కొరడా ఝళిపిస్తుందనే ఊహాగానాలకు మొయిలీ ప్రకటనతో తెరపడింది. జగన్ ఓదార్పు యాత్ర శుక్రవారం రాత్రి రాజమండ్రి చేరేటప్పటికే ఈ ప్రకటన రావడం, ఎమెల్యేలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొనడం జరిగిఫోయాయి. మొయిలీ ప్రకటనతో పలువురు ప్రజాప్రతినిధులు శనివారం ఉదయం జగన్ ను కలుసుకున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో కేంద్రమంత్రి పళ్ళంరాజు, ఎంపీ ఉండవల్లి, రాష్ట్రమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొనడంతో యాత్రపై పార్టీ శ్రేణుల్లో మరింత ఆదరణ పెరిగింది.
No comments:
Post a Comment