ముఖ్యమంత్రి రోశయ్యపై విమర్శలు చేయడంతో పాటు సవాళ్లు విసిరి బహిరంగంగా పత్రికలకు ఎక్కిన అంబటి రాంబాబును కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి వీరప్పమొయిలీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కడప ఎంపీ జగన్ మోహన్రెడ్డి వీరవిధేయుడైన అంబటిపై వేటు వేయడం తాజా పరిస్థితుల్లోవ్యూహాత్మకమేనని సమాచారం. అధిష్టానం మాట కాదని యాత్ర చేస్తున్న జగన్ కు పరోక్ష హెచ్చరిక జారీచేయడమే ఈ చర్య ఆంతర్యంగా తెలుస్తోంది.జగన్పై చర్యలు ఉండవని హైదరాబాద్ లో మొయిలీ ప్రకటించిన కొద్దిసేపటికే సోనియా ప్రతినిధిగా అహ్మద్ పటేల్ ఆయనతో మాట్లాడి మేడమ్ అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అనంతరం గంటల వ్యవధిలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్పై క్రమశిక్షణ చర్యల విషయంలో అధిష్టానంపై కొందరు సీనియర్లు తీవ్ర ఒత్తిడి తెస్తున్న తరుణంలో మొయిలీ వ్యాఖ్యలు జగన్ వ్యతిరేకులకు బాగా కలిసివచ్చాయి.
ఓదార్పుపై మొయిలీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలతో.. యాత్రలో పాల్గొనే నేతల సంఖ్య పెరిగింది. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు జగన్ యాత్రలో శనివారం పాల్గొన్నారు. దీంతో సీనియర్లు కంగు తిని ఈ వివరాల్ని తక్షణం ఢిల్లీకి మోసేశారు. ఈ వ్యవహారాలపై అర్జెంటుగా చర్చించేందుకు హస్తిన రావాలంటూ అధిష్టానం రోశయ్యకు కబురు పంపింది. జగన్ వర్గీయుల జాబితా, వారి నేపథ్యాల వివరాలను కూడా పట్టుకురావాలని మేడమ్ ఆదేశించారని వినిపిస్తోంది. ఇదిలాఉండగా తనకింగా సస్పెన్షన్ ఉత్తర్వులు అందలేదని అంబటి చెప్పారు. షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు రెండువారాల గడువివ్వాలని అంబటి కోరడం, దానికి పీసీసీ ఆమోదించడం తెలిసిందే. ఈ గడువు ముగియకుండానే అధిష్టానం ఇలా ఆయన్ను సస్పెండ్ చేయడం చూస్తే ఈ మధ్యలో జరిగిన పరిణామాలే కారణమని అర్ధం అవుతుంది.

No comments:
Post a Comment