తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి సస్పెన్షన్
కాంగ్రెస్ యువనేత, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు మద్దతిచ్చినందుకు గాను ఆయన వర్గానికి చెందిన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ (తుడా) మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వెలివేసింది. చెవిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుధవారం ప్రకటించింది. పీసీసీ క్రమశిక్షణా సంఘం ఈ చర్య తీసుకుంది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నిస్తూ గతంలోనే చెవిరెడ్డికి నోటీస్ జారీ చేసిన విషయం తెల్సిందే. ఆ నోటీస్కు చెవిరెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే దీనికి సంతృప్తి చెందని పార్టీ పెద్దలు ఈ తీవ్రమైన చర్య తీసుకున్నారు. జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, కొండా సురేఖ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులకు ఇప్పటికే పార్టీ నుంచి ప్రతికూలత ఉంది. కొందర్ని దూరం పెడుతూ మరికొందర్ని సస్పెండ్ చేస్తూ అధిష్టానం మొత్తానికి జగన్ వర్గాన్ని ఒకేలా చూస్తున్న విషయం విదితమే.
నోకాజ్ నోటీస్ ఇచ్చారు: చెవిరెడ్డి
సస్పెన్షన్పై తనకెలాంటి బాధా లేదని చెప్పిన చెవిరెడ్డి ప్రజాదరణ లేని, ఎన్నికల్లో గెలవలేని వ్యక్తుల చేతుల్లో పార్టీ బందీగా మారుతోందని ఆవేదన చెందారు. తన సస్పెన్షన్కు సిఫార్సు చేసిన వారికి ప్రజల్లో పరపతే లేదన్నారు. తనకు నో కాజ్ నోటీస్ ఇచ్చారని దుయ్యబట్టారు.

No comments:
Post a Comment