లక్షలాది మంది రైతన్నల పదఘట్టనలతో విజయవాడ దద్దరిల్లింది.. బెజవాడ జనవాడగా మారింది. క్రిష్ణమ్మ జనసంద్రమైంది. తాము ఓటేస్తే గెలిచి తమను పట్టించుకోని సర్కారు తీరుపై నిరసన నినాదం రణన్నినాదంలా కాదు జగన్నినాదంలా మార్మోగింది.. తమ తరఫున పోరాడుతున్న యువనేత జగన్మోహన్రెడ్డికి తోడుగా వచ్చిన అన్నదాతలు, చేనేత కార్మికులతో మంగళవారం బెజవాడ అణువణువూ నిండిపోయింది. లక్ష మందితో సామూహిక నిరాహార దీక్ష చేస్తానని యువనేత ప్రకటిస్తే... తొలిరోజే రెండు లక్షలకుపైగా జనం తరలివచ్చి ఆయనను విజయీభవ అని ఆశీర్వదించారు. కృష్ణా తీరాన ఏర్పాటు చేసిన వైఎస్సార్ దీక్షా ప్రాంగణం జనప్రవాహంతో పోటెత్తింది. లక్షలాది మంది జనం సమక్షంలో, కృష్ణమ్మ సాక్షిగా, సీతమ్మ పాదాల సన్నిధిలో వైఎస్ జగన్ మంగళవారం ఉదయం లక్ష్య దీక్ష పేరిట 48గంటల దీక్ష ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆశీస్సులు, దర్గాలో దీవెనలు అందుకున్న జగన్ మంగళవారం ఉదయం 11.00 గంటలకు నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం కడప, కర్నూలు జిల్లాల్లో అలుపెరగకుండా పర్యటించి, రాత్రంతా రైల్లో ప్రయాణించి వచ్చిన ఆయన కొద్దిసేపైనా విశ్రాంతి తీసుకోకుండానే నిరాహార దీక్ష మొదలు పెట్టారు. యువనేత వైఎస్సార్ ప్రాంగణానికి చేరుకునే సమయానికే ఇసుక తిన్నెల ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. వందలాది మంది నేతలు, అభిమానులు స్వాగతం పలుకుతుండగా జగన్ వేదికపైకి వచ్చి, వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షలో కూర్చున్నారు.
మాజీ మంత్రులు కొండా సురేఖ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్, పుల్లా పద్మావతి, వందలాది మంది నేతలు దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు వైఎస్సార్ ప్రాంగణానికి వచ్చి జగన్కు మద్దతునిచ్చారు. నందమూరి లక్ష్మీపార్వతి, రోజా, రాజశేఖర్-జీవిత దంపతులు, రాజా, విజయచందర్ తదితరులు దీక్షా శిబిరానికి వచ్చారు. వేదికపై నేతల ప్రసంగాలు సాయంత్రం వరకూ సాగాయి. సాయంత్రం 4.30 గంటలకు జగన్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నంత సేపూ అభిమానులు కృష్ణా తీరాన్ని హోరెత్తించారు. అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్ చేసిన ప్రసంగం పదునైన పదాలతో కదనోత్సాహం రగిల్చింది.
దీక్షలో పాల్గొనేందుకు, యువనేతకు మద్దతు తెలిపేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అభిమానులు, నాయకులు తండోపతండాలుగా కృష్ణాతీరానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకే వైఎస్సార్ ప్రాంగణం సగానికి పైగా నిండిపోయింది. సాయంత్రమయ్యేసరికి జనం చీమలబారుల్లా ఉవ్వెత్తున ఇసుక తిన్నెలకు చేరుకున్నారు. పాదయాత్రలు, ప్రదర్శనలుగా తరలివస్తున్న వారితో కృష్ణలంక హైవే, కెనాల్ రోడ్డు, కాళేశ్వరరావు మార్కెట్, కంట్రోల్రూమ్ తదితర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. యువనేతను చూసేందుకు పసి పిల్లలను చంకన వేసుకుని కొందరు కుటుంబ సమేతంగా ఆ ప్రాంతానికి రావడం విశేషం.
జగన్ చూసేందుకు అభిమానులంతా వేదిక వద్దకు దూసుకొచ్చేశారు. పోలీసులు వారిని ఆపలేక చేతులెత్తేశారు. దీంతో వేదిక చుట్టూ వేలాది మంది జనం చేరిపోయారు. జగన్ ను పలుకరించేందుకు, చేయి కలిపేందుకు వారు తహతహలాడారు. ఇక చేసేదిలేక చాలామందిని వేదికకు అనుబంధంగా వేసిన మార్గంలోకి అనుమతించి యువనేత వద్దకు పంపారు. మరోవైపు వెనుక మార్గం నుంచి అనేక మంది వేదిక పైకి ఎక్కేశారు. పలుమార్లు నేతలతోపాటు జగన్ వారిని వారించినా ఫలితం లేకపోవడంతో లాఠీచార్జి కూడా జరిగింది. ఈ గందరగోళంలో బ్యారికేడ్లు, లైట్లు ధ్వంసమయ్యాయి. మంగళవారం రాత్రి వరకూ వాహనాలు అసంఖ్యాకంగా నగరంలోకి వస్తూనే ఉండడంతో ఎక్కడికక్కడ దీపతోరణాల్లా, చీమల బారుల్లా వాహనాలు, జనమే గోచరించాయి. .
ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 23 మంది ఎమ్మెల్యేలు విజయవాడ వచ్చి జగన్కు మద్దతు పలికారు. వీరిలో కొందరు జగన్ను ప్రభుత్వ అతిథి గృహంలో కలిశారు. మరి కొందరు దీక్షలో పాల్గొన్నారు. వీరితోపాటు ఇతర జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు. మరికొందరు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులూ ఫోన్లో యువనేతను పలకరించి దీక్ష సక్సెస్ కావాలని అభిలషించడం విశేషం.
రైతులకోసం జగన్ ఇచ్చిన 48 గంటల దీక్ష పిలుపుకు రాష్టవ్య్రాప్తంగా లభించిన స్పందన పార్టీలకూ.. ప్రాంతాలకూ అతీతంగా ఉంది. ప్రస్తుతానికి ఏపార్టీకీ చెందని జగన్ ఇచ్చిన పిలుపునకు స్పందనగా కాంగ్రెస్, పీఆర్పీ, తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు సంఘీభావం ప్రకటించారు. మరో పదిరోజుల్లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే సమయంలో కూడా ప్రాంతాలకు అతీతంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాలనుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ జగన్ ను ఒంటరిని చేసి పంపాలనుకుంది. అయితే ఇప్పుడు జగన్ ఒంటరి కాదు.. లక్షలాది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జననేతగా ఆయన కృష్ణా నదీతీరంలో సీతమ్మ పాదాల సాక్షిగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. ముఖ్యంగా భారీ వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్న ప్రాంతాల రైతులు, కౌలు రైతులు, చేనేత కార్మికులు దీక్షకు అధిక సంఖ్యలో వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్యాకేజీలో కౌలు రైతుల ప్రస్తావన లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన రైతులు, వరి సాగుతో కుదేలైన ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు ఈ దీక్షకు హాజరయ్యారు. వీరితోపాటు చేనేత కార్మికుల సమస్యలపై జగన్ సమరభేరి మోగించడంతో ఆ వర్గం కార్మికులు, రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.

No comments:
Post a Comment