జగన్ వెంట నడిచే ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకీ విస్తరిస్తోంది. ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యేలను సముదాయించడం, బుజ్జగించడం తంటాగా మారింది. బందరు ఎమ్మెల్యే పేర్ని నానీని ముఖ్యమంత్రి బతిమాలినా ఫలితం లేకపోయింది. ఆయన్ను ఏదో చేసి ఏదో విధంగా తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాల్ని సీఎం చేస్తుండగానే తూర్పుగోదావరి జిల్లానుంచి నల్లమిల్లి శేషారెడ్డి రూపంలో మరో బాంబు పేలింది.
తన నియోజక వర్గ కార్యకర్తల అభీష్టం మేరకు తాను వైఎస్ జగన్ యాత్రలో పాల్గొనబోతున్నట్టు శేషారెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆయనతో మాట్లాడినా శేషారెడ్డి తన వైఖరి మార్చుకోలేదు. తన కార్యకర్తలందరూ జగన్ కే మద్దతు ఇస్తుండగా తనకు వెళ్లకుండా ఉండటం ఎలా సాధ్యమని శేషారెడ్డి సీఎం ను ప్రశ్నించారని సమాచారం. ఇదిలావుంటే ఇంకా తూర్పు గోదావరి జిల్లాలో జగన్ కు బాసటగా నిల్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆది నుంచి జగన్ కుడిభుజంలా ఉంటూ మంత్రి పదవిని సైతం త్యజించడానికి సిద్ధపడిన మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్యనాయకులతో కీలక మంతనాలు సాగిస్తున్నట్లు భోగట్టా. మరోవైపు జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబాలు ముద్రగడ, జక్కంపూడి సైతం జగన్ వెంటే ఉన్నాయి. తూర్పుగోదావరి యాత్రతో జగన్ ప్రజాబలం, ఆయనకున్న రాజకీయ మద్దతు ప్రస్ఫుటం అవుతుందని అంటున్నారు.
ఈ యాత్రలో తన జన బలాన్ని ప్రదర్శించి అధిష్టానం గుండెల్లో రైళ్లు పరుగెట్టించాలని జగన్ వర్గం కదన కుతూహలంతో ఉంది. జగన్ ఎక్కడ యాత్ర చేపట్టినా జనం తండోపతండాలుగా స్వచ్చందంగానే వస్తున్నారని జిల్లా రాజకీయ నేతలు చెబుతున్నారు.

No comments:
Post a Comment